
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏరియల్ సర్వేకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
శివరాజ్సింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి నేరుగా ఖమ్మం చేరుకోనుండగా బండి సంజయ్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. అనంతరం పంట నష్టంతోపాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో వారు సమీక్షించనున్నారు.