కొన్నిరోజులుగా ఇంట్లో వరుసగా డబ్బు, నగలు మాయం అవుతుండటంతో యజమానికి అనుమానం పెరిగింది. ఇంటా బయట సీసీటీవీలు ఏర్పాటు చేయించాడు. వాటిల్లో కనిపించిన దృశ్యాలు ఆయనను షాక్కు గురి చేశాయి. వెంటనే అప్రమత్తమై దొంగను అడ్డుకోగా.. ఆమె చేసిన పని నెట్టింట వైరల్గా మారింది.
రాజస్థాన్లోని జైపూర్ ముహానా ప్రాంతంలోని ఓ ఇంట్లో కొద్దిరోజులుగా అనుమానాస్పద చోరీలు జరుగుతున్నాయి. మొదట్లో చిన్నగా డబ్బు మాయం కావడం ప్రారంభమై, తర్వాత నగలు కూడా కనిపించకపోవడంతో యజమాని అనుమానం బలపడింది. దీంతో ఆయన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.
గురువారం కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్లో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్రూమ్ వైపు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అల్మారా తెరిచి నగల పెట్టెను పరిశీలిస్తున్న దృశ్యాలను చూసిన యజమాని ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. తక్షణమే అప్రమత్తమైన యజమాని పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటి గేటును లాక్ చేయించాడు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న వారు ఆమెను ఇంట్లోనే అడ్డుకున్నారు.
అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. బయటపడే మార్గం లేకపోవడంతో ఆమె తీవ్రంగా బెదిరింపులకు దిగింది. పోలీసులు వస్తారా? రానివ్వు.. వాళ్లు వచ్చేలోపు నా దుస్తులు విప్పేస్తా!. నువ్వు నన్ను బలవంతం చేయబోయావని ఏడుస్తా.. వాళ్లు నిన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నీ గతి అదోగతే.. నన్ను బయటకు పోనివ్వండి’’ అంటూ ఆమె చెప్పిన మాటలు విని ఆ ఓనర్, స్థానికులు నిర్ఘాంతపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


