నెల్లూరు జిల్లా: తనను దూరం పెడుతోందని సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి మహిళపై కిరాతకానికి ఒడిగట్టాడు. మెడ భాగంలో స్క్రూడ్రైవర్తో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. జలదంకికి చెందిన ఉప్పు సునీత (30)కు 15 ఏళ్ల క్రితం ఉప్పు శీనుతో వివాహమవ్వగా విభేదాలు రావడంతో ఐదేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె (14), కుమారుడు(13) శిశు సంక్షేమ పాఠశాలలో చదువుతున్నారు. మేస్త్రీ పనులకు వెళ్తున్న సునీత, కొండాపురం మండలానికి చెందిన మహేంద్ర (30) ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
సునీత, ఉప్పు శీనుకు ఈ నెల 7న జలదంకి పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మహేంద్ర ఫోన్ నంబర్ను సునీత బ్లాక్ చేసింది. మంగళవారం మహేంద్ర వెంగళరావునగర్లో సునీత ఇంటికి వచ్చాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొద్దిసేపటి తర్వాత సునీత ఇంట్లో మృతి చెంది కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాస్థలికి రాగా..సునీత మెడపై రక్తగాయాలను గుర్తించారు. స్క్రూడ్రైవర్తో సునీతపై దాడి చేసినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. మహేంద్రే హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


