
సీఎం మమత జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
రిష్రా(పశ్చిమబెంగాల్): భారత్–పాక్ల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్ రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్ కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పరిస్థితులు తన భర్త విడుదల ప్రయత్నాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సాహు భార్య రజని గురువారం ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, అధికారికంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులకు తనకు హామీ ఇచ్చారని, తన భర్త తిరిగి వస్తాడని ఆశించానని తెలిపారు. కానీ, ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. తన భర్త కేసును అత్యున్నత స్థాయిలో విచారించేలా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జోక్యం చేసుకోవాలని రజనీ కోరారు. పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సెక్టార్ లో విధు లు నిర్వహిస్తున్న నలభై ఏళ్ల సాహు అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి పాక్ సైనికులకు చిక్కాడు.