నాందేడ్: తాను భయపడే ప్రసక్తే లేదని అకాలీదళ్ చీఫ్, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. తనపై జరిగిన దాడిని ఆయన కుట్రగా అభివర్ణించారు. పంజాబ్ శాంతిభద్రతలను అస్థిరపరిచే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అకాలీదళ్ కట్టుబడి ఉందన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం తమ పార్టీ ఎలాంటి బలిదానానికైనా సిద్ధంగా ఉందని.. అయితే పంజాబ్ శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమంటూ తేల్చి చెప్పారు. పంజాబ్ ప్రగతి, మతసామరస్యం, ఐక్యత తమ మొదటి ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు.
నాందేడ్లోని ఓ గురుద్వారాను తన కుటుంబంతో కలిసి దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలో జస్పాల్ సింగ్ అనే వ్యక్తి చిన్నకత్తితో సుఖ్బీర్ సింగ్ బాదల్ దాడికి యత్నించాడు. అయితే ఆయనతో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో బాదల్ కుడి చేతికి గాయమైంది. దాడి చేసిన నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకోగా.. అతడు పుణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత రెండేళ్లుగా ఆ గురుద్వారాలో సేవకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం.


