న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్జీసీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్ అవసరాల్లో 30 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.
పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్ కుమార్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్జీఆర్బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.


