టెహ్రాన్: అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం తమ హక్కు అంటూ ఇరాన్ అణు సంస్థ అధిపతి మహ్మద్ ఎస్లామీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ హక్కుల పరిరక్షణకు అత్యవసరమంటూ ఇరాన్ స్పష్టం చేసింది. టెహ్రాన్లోని దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా.. మొహమ్మద్ ఎస్లామీ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమెరికాతో చర్చలకు ముందు ఇరాన్ ఘాటు హెచ్చరికలు చేసింది. చర్చలు విఫలమైతే దీర్ఘ కాలిక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ తేల్చి చెప్పింది. దీర్ఘకాలిక యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. హర్మూజ్ తెరవకపోతే మళ్లీ దాడులుచేస్తామంటూ ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే..
మరోవైపు.. కాల్పుల విరమణ నేపథ్యంలో.. నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్ పోటాపోటీగా ప్రకటించుకున్నాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించగా.. ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పలు పోస్టులు చేశారు.


