పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి | BIMS Hospital In Belagavi incident | Sakshi
Sakshi News home page

పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి

Feb 3 2025 1:39 PM | Updated on Feb 3 2025 2:17 PM

 BIMS Hospital In Belagavi incident

బెళగావి బిమ్స్‌లో మరొకరు మృతి

4 రోజుల్లో రెండవ విషాదం

యశవంతపుర (కర్ణాటక): రాష్ట్రంలో బాలింతల మరణాలు కొనసాగుతునే ఉన్నాయి. బెళగావి తాలూకా కరడిగుద్ది గ్రామానికి చెందిన గంగవ్వ గోడకుంద్రి (31) అనే బాలింత మరణించింది. జనవరి 28న గంగవ్వ ప్రసవం కోసం బెళగావి బిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. జనవరి 30న రాత్రి కొడుకు పుట్టాడు. జనవరి 31న బీపీ పడిపోయి ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు కుటుంబసభ్యుకు తెలిపారు. చికిత్స పొందుతూ గంగవ్వ కన్నుమూశారు. వైద్యులు నిర్లక్ష్యంగా ప్రసవం చేయడం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

 ప్రసవానికి ముందు ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని వైద్యులు తమ వద్ద తెల్ల పేపర్‌పై సంతకం చేయించుకొన్నారని, చివరకు మృతదేహాన్ని అప్పగించారని విలపించారు. ఆరోగ్యం క్షీణించిన సమయంలో సరైన చికిత్సలు చేసి ఉంటే మా అక్క బతికేదని మృతురాలి సోదరుడు శంకరప్ప ఆరోపించారు. బెళగావి ఎపిఎంసి పోలీసుస్టేషన్‌లో వైద్యులపై ఫిర్యాదు చేశారు. పుట్టిన గంటలకే తల్లికి దూరమైన శిశువును చూసి అందరూ అయ్యో అన్నారు.

అదే మాదిరిగా అంజలి పాటిల్‌..
బెళగావి తాలూకా నిలాజి కి చెందిన అంజలి పాటిల్‌ (30) అనే బాలింత 4 రోజుల కిందట బిమ్స్‌లోనే ఇదే మాదిరి చనిపోయింది. ఆమెకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవ వేదన ఆరంభం కాగా, వైద్యులు వేచి చూద్దామని చెప్పారు. చివరకు కుటుంబీకుల ఒత్తిడితో సిజేరియన్‌ కాన్పు చేశారు. కొంతసేపటికి తీవ్ర రక్తస్రావమై ఆమెకు మూర్ఛ వచ్చి మరణించింది. వైద్యుల అలసత్వమే కారణమని బంధువులు ధర్నా చేశారు.

హైరిస్క్‌ కేసులే: వైద్యులు
ఆస్పత్రి వైద్యాధికారులు స్పందిస్తూ, ఈ వైద్యశాలలో ఏడాదికి 10 వేలకు పైగా కాన్పులు చేస్తామని, అందులో సగం హైరిస్క్‌ కేసులని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే తాము శ్రమిస్తామని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, తాలూకా ఆస్పత్రుల నుంచి సీరియస్‌ అంటూ చివరి నిమిషంలో తమ వద్దకు పంపిస్తారని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement