ఎవరూ పట్టించుకోలేదు.. అంజలి వీడియో వైరల్‌ | Actress Anjali upset at Filmfare Awards event at kochi | Sakshi
Sakshi News home page

ఎవరూ పట్టించుకోలేదు.. అంజలి వీడియో వైరల్‌

Feb 24 2026 8:26 AM | Updated on Feb 24 2026 9:17 AM

Actress Anjali upset at Filmfare Awards event at kochi

కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ సౌత్‌ అవార్డ్స్‌ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అర్జున్‌, మమ్ముట్టి, కాజల్‌, సాయిపల్లవి, అంజలి,  నివేదా థామస్‌ వంటి స్టార్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న అంజలికి ఆ కార్యక్రమంలో ఇబ్బందికరమైన అనుభవం ఎదురైందని తెలుస్తోంది.

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రంలో నటించిన అంజలి ఉత్తమ సహాయ నటిగా ఎంపికైంది. అవార్డ్‌ అందుకునేందుకు కొచ్చి విమానాశ్రయంలో ఆమె దిగారు. అయితే,  ఆమెను రిసీవ్‌ చేసుకునేందుకు ఫిల్మ్‌ఫేర్‌ యూనిట్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు ఎవరూ రాలేదట. దాదాపు ఆమె 40 నిమిషాల పాటు వేచి ఉన్నారని తెలుస్తోంది. నిర్వాహకుల సమన్వయ లోపం పట్ల అంజలి అసంతృప్తిని  వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  ఎవరూ పట్టించుకోవడం లేదంటూ అంజలితో ఉన్న వ్యక్తి ఒకరు చెబుతున్న వీడియో వైరల్‌ అవుతుంది.

సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela ) కూడా  ఫిల్మ్‌ఫేర్‌ ఈవెంట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె నిర్మాతగా తెరకెక్కిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి రెండు అవార్డ్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే,  కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఫిల్మ్‌ఫేర్ టీమ్‌ విఫలమైందని ఆమె తెలిపింది. తొలిసారి అవార్డ్స్‌ అందుకునేందుకు వచ్చిన వారిని స్టేజీపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం తనను చాలా బాధించిందని నిహారిక ఒక పోస్ట్‌ చేసింది. మొదటిసారి వేదికపై వచ్చిన వారికి కనీసం ఒక నిమిషమైన టైమ్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడింది. తను నిర్మాతగా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ పరిచయ దర్శకుడు (యదు వంశీ) ఉత్తమ పరిచయ నటుడు (సందీప్‌ సరోజ్‌) అవార్డ్స్‌ అందుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement