బిల్కిస్‌ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్‌ | Bilkis Bano Convicts Bail Pleas Dismissed By Supreme Court | Sakshi
Sakshi News home page

బిల్కిస్‌ బానో కేసు దోషులకు సుప్రీంకోర్టు షాక్‌

Jul 19 2024 1:38 PM | Updated on Jul 19 2024 3:35 PM

Bilkis Bano Convicts Bail Pleas Dismissed By Supreme Court

న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో దోషులు రాధేశైమ్ భగవాన్‌దాస్ షా, రాజుభాయ్ బాబూలాల్ సోనీ సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. రెమిషన్‌(శిక్ష తగ్గింపు) పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు తమకు బెయిల్‌ మంజూరు చేయాలన్న వాళ్ల అభ్యర్థనను తిరస్కరించింది. 

2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో పెద్దఎత్తున మతపరమైన అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్లలో బిల్కిస్‌ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2008లో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే..

.. 14 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారికి 2022లో గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ మంజూరు చేసింది. దీంతో 2022 ఆగస్టు 15న వారంతా జైలు నుంచి విడుదలయ్యారు. గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ బానో సుప్రీం తలుపుతట్టారు. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ.. వారి విడుదల చెల్లదని ఈ ఏడాది జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషుల్ని జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. అయితే తీర్పును సవాలు చేస్తూ భగవాన్‌దాస్, బాబూలాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

తాజా తమ రిమిషన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు తాత్కాలికంగా తమను విడుదల చేయాలని, ఇందుకోసం బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్ ఖన్నా, జస్టిస్‌ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా  పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్‌ జారీ చేసిన ఆర్డర్‌పై మరొక బెంచ్ ఎలా అప్పీల్‌ చేస్తారని ప్రశ్నించింది. దీంతో.. ఇద్దరు పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా దానికి బెంచ్ అనుమతించింది.

Advertisement
 
Advertisement
Advertisement