తొక్కిసలాట.. విషాదాలు: మహా కుంభమేళా నుంచి బెంగళూరు వరకూ.. | Bengaluru to Maha Kumbh List of Major Stampedes | Sakshi
Sakshi News home page

తొక్కిసలాట.. విషాదాలు: మహా కుంభమేళా నుంచి బెంగళూరు వరకూ..

Jun 4 2025 9:01 PM | Updated on Jun 4 2025 9:33 PM

Bengaluru to Maha Kumbh List of Major Stampedes

న్యూఢిల్లీ: పద్దెనిమిది ఏళ్ల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)(ఆర్సీబీ) విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయానికి గుర్తుగా నిర్వహిస్తున్న వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. ఇటీవలి కాలంలో దేశంలో ఆరు ప్రధాన విషాదకర తొక్కిసలాటలు జరగగా, పలువురు మృతిచెందారు. వందలాదిమంది గాయపడ్డారు.

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్(2025, ఫిబ్రవరి)
ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతిచెందారు. మహా కుంభమేళాకు చేరుకునేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైలు ఎక్కడానికి ప్రయాణికులు వేచివుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన 14- 15 ప్లాట్‌ఫారమ్‌లను అనుసంధానించే ఫుట్-ఓవర్‌బ్రిడ్జిపై జరిగింది. కొంతమంది ప్రయాణికులు దిగుతున్నప్పుడు జారిపడి భయాందోళనకు గురయ్యారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.

మహా కుంభ్(2025, జనవరి)
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాటలో 30 మంది  మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. జనవరి 29న తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో యాత్రికులు పవిత్ర స్నానం కోసం గుమిగూడారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.

గోవా ఆలయం(2025 మే)
ఉత్తర గోవాలోని షిర్గావ్‌లో వార్షిక లైరాయ్ దేవి జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో  ఆరుగురు మృతిచెందారు. 50 మందికి పైగా జనం గాయపడ్డారు. విపరీతమైన రద్దీ, తగినంత భద్రతా నిర్వహణ లేకపోవడం వల్ల గందరగోళం చెలరేగి, తొక్కిసలాట జరిగింది.

తిరుపతి( 2025, జనవరి)
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతిచెందారు. ఈ దుర్ఘటన జనవరి 8న విష్ణు నివాసంలో వైకుంఠ ద్వార సర్వదర్శనం కోసం టోకెన్లు పంపిణీ చేస్తున్న సమయంలో జరిగింది.

సంధ్య థియేటర్ (2024, డిసెంబర్‌)
2024 డిసెంబర్ 4 హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షో విషాదానికి దారితీసింది. హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీగా జనం థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. ఈ జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మృతిచెందింది.

హత్రాస్ సత్సంగ్ (2024, జూలై)
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 'భోలే బాబా' నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో  తొక్కిసలాట జరిగి 121 మంది మృతిచెందారు. సత్సంగ్ నిర్వాహకులు 80వేల మందికే అనుమతినివ్వగా, 2.5 లక్షలకు పైగా జనం సత్సంగ్‌కు తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement