విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ తర్వాత వెనక్కి! | Air India Mumbai New York Flight back After 8 Hours For This Reason | Sakshi
Sakshi News home page

విమానంలో 322 మంది.. 8 గంటల జర్నీ.. వెనక్కి వచ్చేసిన ఎయిరిండియా విమానం!

Mar 10 2025 1:19 PM | Updated on Mar 10 2025 3:03 PM

Air India Mumbai New York Flight back After 8 Hours For This Reason

న్యూఢిల్లీ, సాక్షి: ముంబై-న్యూయార్క్‌ ఎయిరిండియా విమానం. ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత.. ఎలా వెళ్లిందో అలాగే తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ప్రయాణికులంతా కంగారు పడ్డారు. మరోవైపు అధికారులు హడావిడిగా వాళ్లందరినీ దించేసి.. బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేయించారు. చివరకు తమకు వచ్చిన సమాచారంగా తేల్చారు. 

303 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్‌ 777 విమానం గత అర్ధరాత్రి 2గం. ముంబై నుంచి న్యూయార్క్‌కు బయల్దేరింది. సుమారు 15 గంటల తర్వాత జాన్‌ ఎఫ్‌ కెనడీ ఎయిర్‌పోర్టుకు అది చేరుకోవాల్సి ఉంది. అయితే విమానంలో బాంబు ఉందనే సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అజర్‌బైజాన్‌ దాకా వెళ్లిన విమానానికి.. వెనక్కి రప్పించారు.

ముంబైలో ఈ ఉదయం 10.20 గం. ప్రాంతంలో ఎయిరిండియా విమానం దిగగానే..  ప్రయాణికులను దించేసి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు. చివరకు బెదిరింపు కాల్‌గా నిర్ధారించుకున్నారు. రద్దైన విమానం మంగళవారం ఉదయం 5గం. రీషెడ్యూల్‌ చేసినట్లు ప్రకటించింది.  అసౌకర్యానికి  ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన ఎయిరిండియా.. వాళ్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపింది. ఈ ప్రయాణంలో వాళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలిపింది. మరోవైపు.. ఈ ఘటనపై ఎయిరిండియా ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement