
హడలెత్తించిన ఎయిరిండియా విమానం
18 గంటల తర్వాత టేకాఫ్
గువాహటి: అహ్మదాబాద్ ప్రమాదాన్ని మరవకముందే గువాహటి– కోల్కతా ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం 170 మంది ప్రయాణికుల్ని హడలెత్తించింది. చివరికి 18 గంటల తర్వాత వారిని మరో విమానంలో పంపించారు. శనివారం రాత్రి 9.20 గంటలకు గువాహటి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో రన్వేపై ఆపేశారు. ప్రయాణికులు రెండుసార్లు విమానం దిగాల్సి వచ్చింది.
దీనిపై దుమ్మెత్తిపోసతఊ వారు పోస్ట్ చేసిన వీడియోలు వైరలయ్యాయి. ‘‘అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో మమ్మల్ని కిందికి దిగమన్నారు. చౌక హోటల్లో వసతి కల్పించారు. కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. ఆదివారం ఉదయం 9.30కు విమానం ఎక్కించి, కాసేపటికే మళ్లీ దించారు. ఎట్టకేలకు మధ్యాహ్నం 3.34కు మరో విమానంలో కోల్కతా బయలుదేరాం’’ అని ఓ ప్రయాణికుడు తెలిపారు. వారి ఆరోపణలను ఎయిరిండియా ఖండించింది. ‘‘నగరంలోని బెస్ట్ హోటల్లో వసతి కల్పించాం. మా సిబ్బందీ అందులోనే ఉన్నారు’’ అని చెప్పింది. సమస్యలేమిటో మాత్రం వెల్లడించలేదు.