మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే | Maharashtra Political Tensions, Aditya Thackeray Operation Fadnavis Claim Sparks Political Firestorm, Check More Details | Sakshi
Sakshi News home page

మహా రాజకీయాల్లో బాంబు పేల్చిన జూనియర్ థాక్రే

Jul 2 2026 10:23 AM | Updated on Jul 2 2026 10:31 AM

Aditya Thackeray Operation Fadnavis Claim Sparks Political Firestorm

మహారాష్ట్ర యువనేత ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమ యూబీటీ(ఉద్దవ్‌ థాక్రే) శివసేన నుంచి జరుగుతున్న వరుస వలసలు యాదృచ్ఛికం కాదని, దీని వెనక పెద్ద కుట్ర దాగుందని అంటున్నారాయన. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై సంచలన ఆరోపణలు చేశారు.  ఇవన్నీ షిండే నేతృత్వంలో జరుగుతున్న ‘‘ప్లాన్డ్ పొలిటికల్ ఆపరేషన్’’లో భాగమని ఠాక్రే ఆరోపించారు.

ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జూనియర్‌ థాక్రే.. మహారాష్ట్రలో గత కొంతకాలంగా జరుగుతుందని ఆపరేషన్‌ టైగర్‌ కాదని.. దానిని ఆపరేషన్ దేవేంద్ర ఫడ్నవిస్‌ అని అభివర్ణించారు. దీని వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దల వ్యూహాత్మక హస్తం ఉందని, షిండేను ముందుంచి ఆ పెద్దలు ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆపరేషన్‌ ఉద్దేశం.. ఫడ్నవిస్‌ను ఎదగకుండా అడ్డుకోవడమే సంచలన వ్యాఖ్యలు చేశారు.

శివసేన (UBT) నుంచి ఇటీవల 9 మంది ఎంపీల్లో 6 మంది షిండే వర్గానికి చేరిన విషయాన్ని ప్రస్తావించిన ఆదిత్య ఠాక్రే.. తమ పార్టీని ఈ పెద్ద రాజకీయ ఎత్తుగడలో “కాలాటరల్ డ్యామేజ్”గా(లక్ష్యంగా కాకపోయినా దెబ్బతినడం) వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ భవిష్యత్తులో కేంద్ర మంత్రివర్గానికి తరలించబడే అవకాశం ఉందని, ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలు తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘బహుశా ఇది దేవేంద్ర ఫడ్నవీస్‌కు చివరి అసెంబ్లీ సెషన్ కావచ్చు’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. షిండే కూడా తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.

వలసల వెనుక డబ్బు పాత్ర ఉందన్న ఆరోపణలను కూడా ఆదిత్య ఠాక్రే పునరుద్ఘాటించారు. కొన్ని వీడియోలు, మీడియా క్లిప్స్‌ను ఆధారంగా చూపుతూ, ఎమ్మెల్యేలు పార్టీ మారిన వెంటనే ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. “పార్టీ మారిన వెంటనే లగ్జరీ ఫ్లాట్లు, ఖరీదైన కార్లు ఎలా వస్తాయి?” అని ఆయన వ్యాఖ్యానించారు.

అదేవిధంగా బీజేపీపై కూడా ఆదిత్య ఠాక్రే తీవ్ర విమర్శలు చేశారు. రామమందిర ట్రస్ట్ నిధులపై వచ్చిన వివాదాలను ప్రస్తావిస్తూ, పారదర్శకతపై ప్రశ్నలు ఉన్నాయని అన్నారు. బీజేపీని ‘‘బాబర్ జనతా పార్టీ’’గా అభివర్ణించారు.

అయితే ఈ ఆరోపణలపై బీజేపీ, షిండే వర్గాలు ఇంకా స్పందించలేదు. అయితే.. ఉద్దవ్‌ శివసేన (UBT) రాజకీయంగా ఒత్తిడిలో ఉండటం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీని బాబర్‌జనతా పార్టీగా అభివర్ణించడమూ  రాజకీయంగా పెద్ద దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement