కేక్‌ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు | 5 Year Old Boy Dies After Eating Cake In Bengaluru | Sakshi
Sakshi News home page

కేక్‌ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు

Oct 8 2024 12:09 PM | Updated on Oct 8 2024 12:09 PM

తిని.. బాలుడు మృతి

ఐసీయూలో తల్లిదండ్రులు

ఘటనపై పలు అనుమానాలు

బనశంకరి: బెంగళూరులో కేక్‌ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.

కొంతసేపటికే విషమం
వివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్‌, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్‌ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్‌ చనిపోగా, బాలరాజ్‌, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.

పోలీసుల విచారణ
కేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్‌ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.

అనేక సందేహాలు
ఓ వ్యక్తి స్విగ్గీలో కేక్‌ ఆర్డర్‌ చేసి తరువాత క్యాన్సిల్‌ చేయడంతో బాలరాజ్‌ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్‌ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్‌ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement