న్యూఢిల్లీలోని మాలవీయ నగర్ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమవ్వడం అత్యంత విషాదకరం. అయితే, ఈ దారుణ ఘటన భారతదేశ అత్యవసర వైద్య సేవల్లో, ముఖ్యంగా కాలిన గాయాల బాధితులకు అందించే చికిత్సా వసతులలో ఉన్న ఒక తీవ్రమైన లోపాన్ని మరోసారి బహిర్గతం చేసింది. బాధితులను కాపాడటంలో సాధారణ ఐసీయూల పరిమితులు ఏంటో ఈ ప్రమాదం కళ్లకు కట్టినట్లు చూపింది.
10 శాతం మార్క్ కీలకం
ఒక వ్యక్తి శరీర ఉపరితల వైశాల్యం(టీబీఎస్ఏ)లో కేవలం 10 శాతానికి మించి కాలిన గాయాలైతే, ఆ బాధితుడి శరీరం స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. సాధారణ గాయాల కంటే ఇవి అత్యంత సంక్లిష్టమైనవి కావడం వల్లే ఈ 10 శాతం మార్క్ అనేది వైద్యంలో అత్యంత కీలకమైనదిగా మారుతుంది. మన చర్మం అనేది శరీరానికి ఒక రక్షణ కవచం లాంటిది. అది 10 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్నప్పుడు, శరీరం నుండి ద్రవాలు వేగంగా ఆవిరైపోతాయి. దీనివల్ల రక్తపోటు పడిపోవడం, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు సోకడం, చివరికి శరీరంలోని కీలక అవయవాలు పని చేయడం మానేసే ప్రమాదం పొంచి ఉంటుంది.
సాధారణ ఐసీయూలలో..
సాధారణ ఐసీయూలను గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, శ్వాసకోస సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నిర్వహణ కోసం రూపొందిస్తారు. కానీ 10 శాతానికి పైగా తీవ్రంగా కాలిన రోగులకు కావలసిన ప్రత్యేక సదుపాయాలు అక్కడ ఉండవు. కాలిన గాయాల బాధితులకు నిరంతరం గాయాలను శుభ్రం చేయడం, శరీర ద్రవాలను భర్తీ చేయడం, ప్రత్యేక పోషకాహారం అందించడం, కొన్ని వారాల పాటు వరుస సర్జరీలు చేయడం అవసరమవుతుంది. ఈ బహుళ అవసరాలకు సరిపోయే సదుపాయాలు సాధారణ ఐసీయూలలో అందుబాటులో ఉండవు. అందుకే ఇవి తీవ్రమైన బర్న్ కేసులకు సరిపోవు.
ప్రత్యేక బర్న్ ఐసీయూలలో..
కాలిన గాయాల బాధితులకు అతిపెద్ద శత్రువు ఇన్ఫెక్షన్. చర్మం దెబ్బతినడం వల్ల బ్యాక్టీరియా సులభంగా రక్తంలోకి ప్రవేశించి ‘సెప్సిస్’ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ప్రత్యేక బర్న్ ఐసీయూలను (Burn ICUs) ప్రత్యేకమైన ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలతో, ఐసోలేషన్ సదుపాయాలతో నిర్మిస్తారు. అక్కడి సిబ్బందికి బర్న్ మేనేజ్మెంట్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. సాధారణ వార్డులలో లేదా ఐసీయూలలో ఉండే గాలి ద్వారా కూడా ఈ రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది.
పొగను పీల్చడం వల్లే..
మాలవీయ నగర్ ప్రమాదంలో మెజారిటీ బాధితులు మంటల కంటే ముందుగా దట్టమైన విషపూరిత పొగను పీల్చడం వల్లే మరణించారని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదాల్లో పొగ అనేది ఒక అదృశ్య హంతకి. విషవాయువులు, వేడి గాలి ఊపిరితిత్తులను, శ్వాసనాళాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అందుకే పైకి తక్కువ గాయాలు కనిపించినప్పటికీ, విషపూరితమైన పొగ పీల్చడం వల్ల తలెత్తే సమస్యలకు ప్రత్యేక విభాగాల్లోనే చికిత్స అందించాల్సి ఉంటుంది.
బర్న్ కేర్ మౌలిక వసతుల లేమి..
ప్రస్తుతం భారతదేశం బర్న్ కేర్ మౌలిక వసతుల కొరతను ఎదుర్కొంటోంది. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల మందికి పైగా జనం కాలిన గాయాల బారిన పడుతుండగా, సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా కేవలం 67 నమోదిత బర్న్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ప్రత్యేక బెడ్ల సంఖ్య కేవలం 1,330 మాత్రమే కాగా, బర్న్ ఐసీయూ బెడ్లు 300 కంటే తక్కువగా ఉన్నాయి. మాలవీయ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రమే మన దేశంలో ఉన్న ఈ మౌలిక వసతుల కొరత తీవ్రత వార్తల్లో కనిపిస్తుంటుంది.
ఇది కూడా చదవండి: ‘చికెన్స్ నెక్’పై భారత్ పట్టు.. చైనా, ‘బంగ్లా’ కుట్రలకు చెక్!


