కోస్గి: ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని లక్ష్యాన్ని సాధించి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోస్గి జూనియర్ సివిల్ న్యాయమూర్తి వడ్లూరి సుస్మిత కోరారు. శనివారం మద్దూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, గురుకుల పాఠశాల, గీతాంజలి పాఠశాల, మండలంలోని పెదిరిపాడు కేజీబీవీ బాలికల పాఠశాలల్లో ఆమె పర్యటించి పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నేటి సమాజ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థి దశ నుంచే విద్యతో పాటు చట్టాలపై అవగాహన ఎంతో అవసరమన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, దాడులు అరికట్టేందుకు న్యాయవ్యవస్థలో పోక్సో చట్టం ఉందని.. తమతో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాలికలు తమ హక్కులు తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఘటనలు ఎదురైనా దాచకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. విద్యార్థుల భద్రత, హక్కుల పరిరక్షణలో పాఠశాలల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమష్టిగా బాధ్యత వహించాలని సూచించారు. అంతకుముందు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు, మౌలిక వసతులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఏఎస్ఐ ఉస్మాన్, పోలీసు సిబ్బంది, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఉన్నారు.


