Sakshi News home page

మరో పది నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే తీవ్ర విషాదం..!

Published Thu, Sep 7 2023 1:30 AM

- - Sakshi

నారాయణ్‌పేట్‌: మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనుకున్న వారిని కారు రూపంలో మృత్యువు వెంటాడింది. తల్లి, తండ్రి, కుమారుడు బైక్‌పై వస్తుండగా.. ఎదురుగా వచ్చిన ఓ కారు వీరిని ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృత్యువాత పడ్డారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తీలేర్‌ స్టేజీ సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలిలా.. మరికల్‌కు చెందిన బొంత వెంకటేష్‌, అనురాధ(35) దంపతుల కుమారుడు శివ(12)కు రెండు రోజుల క్రితం ఓ విష పురుగు కరవడంతో ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. దీంతో నాటు వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మనికొండకు బైక్‌పై వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు తిరిగి బయల్దేరారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు అనగానే తీలేర్‌ స్టేజీ సమీపంలోని రైస్‌మిల్లు వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది.

దీంతో అనురాధ తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు శివను మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. తండ్రి వెంకటేష్‌ పరిస్థితి కూడా విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును నిలపకుండానే డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శంకరయ్య తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement