దేవనకొండ: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఉపేంద్ర, లలిత దంపతుల కుమార్తె మీనా (4) ప్రమాదవశాత్తు వేడి సాంబారులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర తన పొలంలో బోరు మోటార్ దింపి కార్మికులకు భోజనాలు పెట్టేందుకు ఇంటి వద్ద వంట సిద్ధం చేశారు. ఉడికిన సాంబారు పాత్రను కిందకు దింపి ఉంచగా అక్కడ ఆడుకుంటున్న పాప పాత్రలో పడింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బయటికి తీసి దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన రామమద్దిలేటి (41)ని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రామమద్దిలేటి లారీ డ్రైవర్గా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి పలుకూరులో డ్రైవింగ్ పని ముగించుకొని రామయ్య అనే వ్యక్తితో కలిసి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఊరువాకిలి సమీపంలో బైక్ దిగి రోడ్డు పక్కన రామమద్దిలేటి మూత్రం పోస్తుండగా కాలికి విషసర్పం కాటువేసింది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వెంటనే చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రామమద్దిలేటి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. నందివర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


