కొత్తపల్లి: మరికొద్ది గంటల్లో పవిత్ర పుణ్యక్షేత్రమైన సంగమేశ్వరాలయం పూర్తిస్థాయిలో జలాధివాసం కానుంది. తీర ప్రాంతం వెంట ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు అధికంగా వచ్చి చేరుతుంది. మంగళవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టు నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా కష్ణా నది గుండా వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతోంది. దీంతో సప్త నదుల సంగమ ప్రాంతంలో శ్రీశైలం వెనక జలాలు ప్రాచీన సంగమేశ్వర ఆలయం శిఖర భాగానికి చేరుకున్నాయి. మరో నాలుగు అడుగుల మేర శ్రీశైలం జలాశయ నీటిమట్టం పెరిగితే నేడు తెల్లవారేసరికి ప్రాచీన సంగమేశ్వరాలయం కష్ణమ్మ ఒడిలోకి చేరుకొని జలాధివాసం అవుతుంది. కాగా ఈ ఏడాది సంగమేశ్వరాలయంలోని వేపదారు శివలింగాకార స్వామివారు 131 రోజులు భక్తులకు దర్శనమిచ్చి, విశేష పూజలు అందుకున్నారు.
హైపవర్డ్ కమిటీ పర్యటన
ఆత్మకూరురూరల్: ఎన్ఎస్టీఆర్లోని ఆత్మకూరు, గిద్దలూరు అటవీ డివిజన్లలో ఇటీవల రెండు పెద్ద పులులు అసహజ మరణాలకు గురికావడంతో వీటిపై దర్యాప్తు జరిపి పులి సంరక్షణకు తగు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీ మంగళవారం ఆత్మకూరు అటవీ డివిజన్లో పర్యటించింది. డివిజన్లోని ఇందిరేశ్వరం బీట్లో మునిమడుగుల వాగు వద్దకు వెళ్లి పులి మరణించిన ప్రదేశాన్ని వారు పరిశీలించారు. అంతకుముందు వారు బైర్లూటి ఎకో– టూరిజం రిసార్ట్లో జరిగిన రివ్యూ మీటింగ్ పాల్గొన్నారు. అనంతరం వారు గిద్దలూరు డివిజన్కు వెళ్లారు. ఈ పర్యటనలో కమిటీ సభ్యులు అటవీ శాఖ ముఖ్య సలహాదారు మల్లికార్జునరావు, అడిషనల్ పీసీసీఎఫ్ రాహుల్ పాండే, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సభ్యుడు రాజశేఖర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేటివ్ సొసైటీకి చెందిన ఇమ్రాన్ సిద్దిఖి, వన్యప్రాణి శాస్త్రవేత్త నవీన్కుమార్తో పాటు ఎన్ఎస్టీఆర్ఎఫ్డీపీటీ యశోధాబాయి, ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ తదితరులు ఉన్నారు. ఈ పర్యటన ఆసాంతం రహస్యంగా ఉంచారు. విలేకరులను అనుమతించలేదు.


