చిట్యాల : రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై సంబంధిత శాఖల అధికారులు ఆడిట్ నిర్వహించాలని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. చిట్యాల మండలం బొంగొనిచెర్వు పరిధిలోని పేలుడు జరిగిన నోష్ ల్యాబ్స్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పేలుడు జరిగిన తీరును ఆ పరిశ్రమ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల పాటించకపోవటంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్మికులపై పరిశ్రమల నిర్వాహకులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు తక్షణ మెరుగైన వైద్య సహాయంతో పాటు, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నోష్ ల్యాబ్స్లో గాయపడి చికిత్స పొందుతున్న లక్ష్మణ్కుమార్, వెంకటేశ్వర్లుకు మెరుగైన వైద్యం అందించాలని పరిశ్రమ నిర్వాహకులను కోరారు. ఆయన వెంట లొడంగి శ్రవణ్కుమార్, బొడిగె సైదులుగౌడ్, ఎండీ.అక్బర్, జిల్లా సత్యం, జిల్లా లక్ష్మయ్య, బొబ్బలి శంకర్రెడ్డి, సీమ అంజయ్య, దేవేందర్, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.


