ఫ మరో రెండు రోజుల్లో
ఎడమకాల్వకు కూడా..
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ కుడికాల్వకు శనివారం నీటిని నిలిపివేశారు. ఎడమ కాల్వకు మరో రెండు రోజుల్లో నీటిని నిలిపివేయనున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో కుడి కాల్వకు సుమారు 190టీఎంసీల నీటిని విడుదల చేశారు. అలాగే ఎడమ కాల్వకు 150 టీఎంసీల నీటిని వదిలారు. గత ఏడాది వానాకాలం సీజన్ పూర్తయ్యే వరకు వరదలు కొనసాగాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లే కాల్వలద్వారా పొలాలకు తరలించడంతో పాటు చెరువులు నింపారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 528.40 అడుగులుండగా 165.0408టీఎంసీల నిల్వలున్నాయి.
దివ్యాంగులకు
ఉపకరణాల పంపిణీ
నల్లగొండ : మహిళా శిశు, వికలాంగుల, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. జిల్లాలో దివ్యాంగులకు 112 రెట్రో ఫిట్టర్ మోటర్ వెహికల్స్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, వార్డెన్ వెంకటరెడ్డి, బాలయ్య, నవీన్, సునీల్, కొత్త వెంకన్న పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో తనిఖీలు
చండూరు : రేషన్ బియ్యం అక్రమంగా నిల్వచేశారనే సమాచారంతో రైస్మిల్లులు, అనుమానిత ప్రదేశాల్లో శనివారం పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఒకవేళ ఈ దందాలో రేషన్ డీలర్ల పాత్ర ఉంటే వారి డీలర్షిప్ రద్దు చేసేందుకు సిఫారసు చేస్తామని తెలిపారు. తరుచూ ఈ దందాలో పట్టుపడేవారిపై పీడీ యాక్ట్ నమోదుచేసి జైలుకు పంపుతామన్నారు.


