సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతల భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని అమీన్పూర్, ఐలాపురంలో రెండో రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ. 15వేల కోట్లకు పైగా విలువైన భూమిని హైడ్రా కాపాడింది.
ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చి వేసింది. ఆరు అంతస్తుల ముఖీం గెస్ట్ హౌస్తో పాటు ఫామ్ హౌస్ను అధికారులు కూల్చివేశారు. ఇక, ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా.. నిర్మాణాలు జరిపిన భవనాలను హైడ్రా కూల్చివేసింది.
వివరాల మేరకు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో ఒకటి నుంచి 220 సర్వే నంబర్ల వరకూ మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్ను హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది.
కాగా, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం ఆరు అంతస్తుల భవనం నిర్మించారు. స్విమ్మింగ్పూల్తో సహా విలాసవంతంగా ఇంటిని నిర్మించుకున్నారు. అలాగే, ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి ఫామ్ హౌస్ కట్టారు. గుర్రాల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం విశేషం.


