న్యూజెర్సీ: అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. న్యూజెర్సీలోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ‘చికెన్-ఫిల్-ఏ’లో జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం రాత్రి 8:40 గంటల సమయంలో ఈ రెస్టారెంట్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం, ఈ రెస్టారెంట్ లో ఘటన జరిగిన సమయంలో పలువురు వినియోగదారులు ఉన్నారు. కాల్పులు జరిగిన వెంటనే భయాందోళనలు చెలరేగాయి. కొందరు ప్రాణాల కోసం పరుగులు తీశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. కాల్పుల్లో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు మరణించగా, మిగిలిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై యూనియన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం విచారణ చేపట్టింది. కాల్పులు జరిపిన నిందితుడి వివరాలను, ఈ దారుణానికి కారణాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ సంఘటన అమెరికాలో మరోసారి తుపాకీల చట్టాలపై చర్చకు దారితీసింది.


