వాషింగ్టన్ : అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్కు కొత్త టెన్షన్ మొదలైంది. శత్రువును భయపెట్టేందుకు ఉయోగపడిన సముద్ర మందుపాతరలు(సీమైన్స్) ఇప్పుడు ఇరాన్కూ కొత్త భయాందోళనలు పెంచేస్తున్నాయి. సీమైన్స్ కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్కు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్ ఏర్పాటుచేసిన ఇరాన్ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు వాటి పొజిషన్ను ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది.
దీంతో ఇప్పుడు అవి కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్కు కూడా లేదు. దీంతో యుద్ధం పూర్వపు సాధారణ స్థితికి నౌకల రాకపోకలను అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇరాన్ నావికాదళం రంగంలోకి దిగి సీమైన్స్ జాడ కనిపెట్టి వాటిని తొలగించడం లేదా నిర్వీర్యం చేయాల్సి ఉంది. అప్పటిదాకా నౌకల పూర్తిస్థాయి రాకపోకలకు అనుమతి అసాధ్యమనే వార్తలు వినవస్తున్నాయి. కాగా, దీనిపై ఇరాన్ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సీమైన్స్ను జాగ్రత్తగా తొలగించే సాంకేతికత ఇరాన్ వద్ద లేదు అనే పుకార్లు సైతం ఎక్కువయ్యాయి. దీంతో కాల్పుల విరమణ ఇప్పటికే మొదలైనా నౌకల సాఫీ ప్రయాణంపై ఇంకా సందిగ్ధత రాజ్యమేలుతోంది.


