మంగపేట : మండలంలో ఇసుకాసురుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల సహకారం రాజకీయ నాయకుల పలుకుబడితో కేంద్రంలోని గౌరారం, మల్లూరువాగు, రాజుపేట ముసలమ్మ వాగుల్లో జోరుగా జేసీబీలతో తవ్వకాలు చేపడుతూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారుల సహకారం, రాజకీయ నాయకుల పలుకుబడితో తమ అక్రమదందాను ఆపేదెవరు.. అడ్డుకునే దమ్ము ఎవరికుందనే ధీమాతో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఏకంగా జేసీబీతో తవ్వకాలు జరుపుతూ మంగపేట, కమలాపురం, మల్లూరులో సిమెంటు ఇటుకల తయారీ పరిశ్రమలు, సీసీరోడ్ల నిర్మాణం, పలు ప్రైవేట్ పనులకు ట్రాక్టర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు గౌరారంవాగు నుంచి బోరునర్సాపురం వద్ద నిర్మించిన కరకట్ట మీదుగా రాకపోకలు సాగిస్తుండటంతో కట్టపై భారీ గోతులు పడి పొలాలకు వెళ్లే వీలులేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వాగుల్లో నుంచి అక్రమంగా తరలింపు


