మంగపేట: గొత్తికోయ గిరిజనులు పాత పోడు భూములు మాత్రమే పంటలు సాగుచేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని తక్కెళ్లగూడెం, ముసలమ్మతోగు ప్రాంతాల్లోని పోడు సమస్యపై గొత్తికోయ గిరిజనులతో అటవీశాఖ అధికారులు, ఎస్సై టీవీఆర్ సూరి సమక్షంలో యానయ్య చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవుల సంరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఎన్నో ఏళ్లుగా పోడు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజన రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు, రైతులు సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. పాత పోడు భూముల్లో మాత్రమే పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అదే విధంగా అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని, సాగుచేసుకుంటున్న భూముల్లో ట్రెంచ్ కొట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. అధికారులు రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. రైతులు, అటవీశాఖ అధికారులు ప్రశాంత వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకోవాలని యానయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ దోమెడ సెక్షన్ డీఆర్ఓ అప్సరున్నీసా, ఎఫ్ఆర్ఓ నర్సింగరావు, బీట్ ఆఫీసర్లు, గిరిజన రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి
యానయ్య


