
సమంత(Samantha), నాగ చైనత్య కెరీర్లో మరిచిపోలేని చిత్రం ‘ఏ మాయ చేసావే’. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2010లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సమంత నటిగా ఎంట్రి ఇచ్చింది కూడా ఈ చిత్రంతోనే. అంతేకాదు నాగచైతన్యతో ప్రేమలో పడడానికి కారణం కూడా ఈ మూవీనే .అందుకే అటు నాగ చైతన్య(Naga Chaitanya)కు గాని, ఇటు సమంతకు గాని ‘ఏ మాయా చేసావే’ చిత్రం చాలా స్పెషల్. సమంత అయితే ఏకంగా ఈ చిత్రం పేరు (వైసీఎం)తో టాటూనే వేయించుకుంది.
చైతన్యతో విడిపోయినా.. ఇప్పటికీ తన ఫేవరేట్ చిత్రం ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. నాగ చైతన్య కూడా తన ఫేవరేట్ చిత్రాల్లో వైఎంసీ ఒకటి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇలా ఇద్దరికీ చాలా ఇష్టమైన చిత్రం మళ్లీ థియేటర్స్లో సందడి చేయబోతుంది. జులై 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. అటు అక్కినేని ఫ్యాన్స్తో పాటు సమంత అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీరిలీజ్ చేయాలని సగటు సినీ ప్రియులు కూడా కోరుకున్నారు. ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత మళ్లీ జెస్సీ(సమంత), కార్తీక్ (నాగ చైతన్య)ల లవ్స్టోరీ మళ్లీ వెండితెరపై చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఈ సినిమా కంటే ఎక్కువగా మరో విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
రీరిలీజ్ ప్రమోషన్స్ లో సమంత, నాగ చైతన్య కలిసి పాల్గొంటారా? అని ఇరువురు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుంటున్నారు. ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇది అసాధ్యమనే చెప్పాలి.
చైతూ గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మాజీ భర్తని కలిసేందుకు ఇష్టపడుతుందా అంటే .. కష్టమనే చెప్పాలి. అటు నాగ చైతన్య కూడా శోభితతో పెళ్లి తర్వాత అన్ని మర్చిపోయి హాయిగా కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన కూడా సామ్తో కలిసి ప్రమోషన్స్లో పాల్గొనడం కష్టమే. అభిమానుల కోరుకున్నట్లుగా వీరిద్దరు కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇప్పట్లో అసాధ్యం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.