
ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు సైతం తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో జంట తమ పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది. ప్రముఖ సీరియల్ నటి లతా సబర్వాల్.. తన భర్త సంజీవ్ సేథ్తో విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత నేను.. నా భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం. నాకు అందమైన కొడుకును ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దాదాపు పెళ్లైన 16 ఏళ్లకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనను, తన కుటుంబాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించింది. వీరిద్దరు బుల్లితెర నటీనటులు కాగా.. 'యే రిష్టా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్లో కలుసుకున్నారు. ఈ సీరియల్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇందులో భార్య, భర్తల పాత్రల్లో వీరిద్దరు నటించారు. అంతేకాకుడా ఈ జంట 2013లో 'నాచ్ బలియే 6' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత ప్రేమలో పడిన జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంటకు 2013లో ఓ కుమారుడు జన్మించారు. మరోవైపు సంజీవ్ సేత్ గతంలోనే నటి రేషమ్ టిప్నిస్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఈ జంట విడిపోయారు. అయితే పలు సీరియల్స్లో తనదైన నటనతో మెప్పించిన లతా సబర్వాల్ 2021లో నటనకు గుడ్బై చెప్పేసింది. ఆమె సీరియల్స్తో పాటు 'వివా', 'ఇష్క్ విష్క్' వంటి చిత్రాలలో కూడా కనిపించింది.