
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నానని చెప్పి తనను మోసం చేసిందని కోలీవుడ్ బుల్లితెర నటి నిహానాబేగంపై వ్యాపారవేత్త పూందమల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ్లో బాగా పాపులర్ అయిన 'పొన్ని, పాండియన్ స్టోర్స్' వంటి పలు సీరియల్స్లో నిహానాబేగం నటించింది. అయితే, చెన్నై దగ్గరలో ఉన్న కోళపాక్కంకు చెందిన రాజ్కన్నన్ అనే వ్యాపారవేత్త ఆమె తనను మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అందులో ఇద్దరు పిల్లల తల్లి అయిన నిహానాబేగం తాను భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పిందన్నారు.
ఆమెతో తన పరిచయం స్నేహంగా మారి, ఆ తరువాత పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నిహానాబేగం తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని తరువాత తెలిసిందని, తనను మోసం చేసి, రూ.20 లక్షలు తీసుకుందని ఆరోపించాడు. తనను మోసం చేసిన ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని, తన నుంచి తీసుకున్న రూ.20 లక్షలను తిరిగి ఇచ్చేలా చేయాలని బాధితుడు పిటిషన్లో కోరాడు. పోలీసులు నిహానాబేగంను, రాజ్కన్నన్ను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారించడానికి సిద్ధమయ్యారు.