తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ ఓటీటీ ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైంది. కనికా ధిల్లాన్ రచించి, నిర్మించిన ఈ చిత్రానికి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. సెప్టెబర్ 3, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. భావోద్వేగాలతో పాటు హై- యాక్షన్ సన్నివేశాలతో ‘గాంధారి’ని రూపొందించినట్లు తెలుస్తోంది. తాప్సీ, కనికా ధిల్లాన్, నెట్ఫ్లిక్స్ కాంబినేషన్లో వస్తున్న మరో చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘గాంధారి’పై ఆసక్తి నెలకొంది.
ఎలా ఉంటుందంటే..
కల్పిత పట్టణం జయ్పుర్రా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తాప్సీ బాణి అనే తల్లి పాత్రలో కనిపించనుంది. తన కుమార్తెను వెతికి, ఆమెను కాపాడేందుకు బాణి చేసే పోరాటమే కథాంశం. కుమార్తెకు దగ్గరవుతున్న కొద్దీ ఆమెకు ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్లు మరింత తీవ్రమవుతాయి. ఈ సినిమా కోసం తాప్సీ అత్యంత కఠినమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్లు చిత్రబృందం తెలిపింది. ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఒక తల్లి తన పరిస్థితులకు తలొగ్గకుండా కూతురిని కాపాడుకునేందుకు చేసే పోరాటాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు కనికా ధిల్లాన్ తెలిపారు. బాణి ప్రయాణం పచ్చిగా, పట్టుదలతో, వ్యక్తిగత భావోద్వేగాలతో సాగుతుందని ఆమె పేర్కొన్నారు. తాప్సీతో మరోసారి కలిసి పనిచేయడం ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పారు.


