సాధారణంగా స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన తర్వాత హీరోయిన్లు చాలామంది.. చిన్న హీరోలతో కలిసి పనిచేసేందుకు పెద్దగా ఇష్టపడరు. మరీ ముఖ్యంగా కమెడియన్ల పక్కన నటించాలంటే ఆలోచిస్తారు. కానీ ట్రెండింగ్ హీరోయిన్ మమిత బైజు మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా 'ప్రేమలు' ఫేమ్ సహయ నటుడితో కలిసి మూవీ చేసేందుకు రెడీ అయింది. ఈ ప్రాజెక్టుని అధికారికంగానూ ప్రకటించారు.
'ప్రేమలు' మూవీతో హీరోయిన్గా మమితకు దక్షిణాదిలో మంచి క్రేజ్ వచ్చింది. ఇందులోనే హీరో ఫ్రెండ్ అమూల్ అనే పాత్రలో చేసిన సంగీత్ ప్రతాప్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. 'హలో డియర్' అనే టైటిల్తో సినిమాని కూడా ప్రకటించారు. డినో పావులోజ్ అనే కొత్త దర్శకుడు దీన్ని తీస్తున్నాడు.
మమిత విషయానికొస్తే మలయాళంలో 2016లో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. సూపర్ శరణ్య, కోకో, ప్రణయ విలాసం తదితర మూవీస్లో సహాయ నటిగా చేసింది. ఎప్పుడైతే 'ప్రేమలు' హిట్ అయిందో ఈమె దశ తిరిగిపోయింది. తర్వాత తమిళంలో చేసిన 'డ్యూడ్' హిట్ కావడంతో ఈమెకు మరింతలా కలిసొచ్చింది. రీసెంట్ టైంలో దళపతి విజయ్ చివరి మూవీ 'జన నాయగన్', సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'లో అదరగొట్టింది. ఈమె చేసిన 'బెత్లహమ్ కుడుంబ యూనిట్' అనే మలయాళ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజైంది. ఇంతలా స్టార్డమ్ వచ్చినప్పటికీ ఓ కమెడియన్ పక్కన హీరోయిన్గా నటించేందుకు అంగీకరించి హాట్ టాపిక్ అయిపోయింది.


