'నెక్ట్స్‌ వేకేషన్‌ జమ్మూ కశ్మీర్‌లోనే'.. కేఎల్ రాహుల్ మామ సంచలన కామెంట్స్! | Suniel Shetty Has Requested Citizens To Spend Their Next Holidays In Kashmir To Boost Tourism And Counter Terrorism, Video Viral | Sakshi
Sakshi News home page

Suniel Shetty: 'నెక్ట్స్‌ వేకేషన్‌ జమ్మూ కశ్మీర్‌లోనే'.. సునీల్ శెట్టి సంచలన కామెంట్స్!

Apr 26 2025 10:33 AM | Updated on Apr 26 2025 11:00 AM

Suniel Shetty has Requested citizens to spend their next holidays in Kashmir

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సంచలన కామెంట్స్‌ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తన వేకేషన్‌ను జమ్మూ కశ్మీర్‌లోనే ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి.. ఉగ్రవాదంపై పోరాటానికి భారతీయులంతా ఏకం కావాలని ఆయన కోరారు. ముంబయిలో జరిగిన లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు- 2025 వేడుకకు హాజరైన  ఆయన పహల్గామ్‌ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగమని.. ఇలాంటి సమయంలోనే మనం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరూ కూడా భయానికి కానీ.. ద్వేషానికి కానీ లోనుకావద్దని దేశ ప్రజలను సునీల్ శెట్టి  కోరారు.

సునీల్ శెట్టి మాట్లాడుతూ.. "మనం మానవాళికి చేసే సేవే భగవంతుని సేవ. సర్వశక్తిమంతుడు అన్నీ చూసి ప్రతిస్పందిస్తాడు. ప్రస్తుతం మనం భారతీయులుగా ఐక్యంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న వారి వలలో మనం పడకూడదు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా ఉండాలి. కశ్మీర్‌ మనదే.. ఎల్లప్పుడూ మనదే అని వాళ్లకి మనం చూపించాలి. అందుకే కాశ్మీర్‌లో తన విహారయాత్రను ప్లాన్ చేసుకుంటున్నా. మీరు కూడా కశ్మీర్‌లో పర్యటించాలని భారతీయ పౌరులను కోరుతున్నా. ఒక పౌరుడిగా మనం ఈ పని చేయాలి. మన తదుపరి వేకేషన్‌ కశ్మీర్‌లోనే ఉండాలి. ఎందుకంటే మనం భయపడలేదని.. మనకు భయం లేదని వారికి చూపించాలి' అని పిలుపునిచ్చారు.

ఇ‍ప్పటికే తాను అధికారులను సంప్రదించానని.. అవసరమైతే కశ్మీర్‌లో పర్యటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సునీల్ పేర్కొన్నాడు. తమ సినిమాలను సైతం అక్కడే షూటింగ్‌ నిర్వహిస్తామని అధికారులకు వివరించినట్లు వెల్లడించారు. ఎందుకంటే మన కశ్మీరీలు ఎప్పటికీ మనకు తోడుగా నిలుస్తారని సునీల్ శెట్టి అన్నారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ ప్రాంతం నుంచి పర్యాటకులు తరలివెళ్లడంతో అక్కడి స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసారన్ లోయ వద్ద పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. 26 మందిని హతమార్చారు. ఈ ఘటనతో యావత్‌ భారతదేశం షాకింగ్‌కు గురైంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement