
సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది సింగర్ సునీత (Sunitha Upadrashta). మృదువైన స్వరంతో ఆమె పాట పాడితే అమృతం కురిసినట్లే ఉంటుంది. ఈమె మాట్లాడితే కూడా తీయని పాట పాడుతున్నట్లే అనిపిస్తుంది. ప్రేక్షకుల మనసులో చిరకాలం నిలిచిపోయే పాటలెన్నో పాడిన సునీత మనసు నేడు సంతోషంతో ఉప్పొంగిపోతోంది. అందుకు కారణమేంటో చూసేద్దాం..
సునీత భావోద్వేగం
ఏ తల్లికైనా తను సాధించిన విజయాల కంటే పిల్లలు సాధించిన విజయాలే గొప్పగా కనిపిస్తాయి. చేతుల్లో ఆడించిన చంటిపిల్లలు కళ్లముందు ఎదుగుతుంటే ఆ తల్లి ఆనందం అంతా ఇంతా కాదు. సునీత కూతురు శ్రేయ తాజాగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది.

ఎంత గర్వంగా ఉందో..
మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్బుక్లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా కూతురు ఇప్పుడు ప్రాట్ ఇన్స్టిట్యూట్లో ఇల్లుస్ట్రేటర్గా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది.

ఫ్యామిలీ ఫోటో.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
నీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. శ్రేయ గ్రాడ్యుయేషన్ డేకు సునీత భర్త రామ్, కుమారుడు ఆకాశ్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. చాలాకాలం తర్వాత ఫ్యామిలీ ఫోటో షేర్ చేశారని అభిమానులు ఖుషీ అవుతున్నారు.
మొదటి భర్త సంతానమే శ్రేయ
కాగా సునీత 19 ఏళ్ల వయసులోనే కిరణ్ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి కూతురు శ్రేయ, కుమారుడు ఆకాశ్ సంతానం. రానురానూ దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సునీత- కిరణ్ విడిపోయారు. 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని సునీత రెండో పెళ్లి చేసుకుంది.
చదవండి: దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా?