ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ గోపరాజు హీరోగా వస్తోన్న చిత్రం కొత్త మలుపు. ఈ మూవీలో భైరవి అర్ధ్యా హీరోయిన్గా నటిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తధాస్తు క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించగా.. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎ. కోదండరామి రెడ్డి మాట్లాడుతూ..'ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కాన్సెప్ట్ కూడా నచ్చింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద విజయంగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ రొమాంటిక్ ప్రేమకథలో ప్రేమ, సస్పెన్స్, వినోదం ఉండేలా కనిపిస్తోంది. ఇందులో ఆకాష్, భైరవి బావ, మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, ఉత్కంఠ, హాస్యం, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వీరాజ్, ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు.
దర్శకుడు శివ వరప్రసాద్ మాట్లాడుతూ..' మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక దిగ్గజం కోదండరామి రెడ్డికి హృదయ పూర్వక ధన్యవాదములు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అని తెలిపారు.


