
దేశవ్యాప్తంగా ఐపీఎల్ హంగామా నడుస్తోంది. ప్రతి మ్యాచ్ ప్రేక్షకులల్లో హీట్ను పెంచుతుంది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ మ్యాచ్లకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారనే విషయం తెలిసిందే. గత సీజన్లో మాదిరి ఈసారి కూడా RCB జట్టు పెద్దగా రాణించడంలేదు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్కసారి మాత్రమే జట్టు గెలిచింది. RCB జట్టు ఓటములకు ప్రధాన కారణం కన్నడ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్కుమార్ సతీమణి అశ్విని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమైంది. తొలిరోజు జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. ఆ తర్వాత పంజాబ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. మూడో మ్యాచ్ కోల్కతా జట్టుతో తలపడి ఓడిపోయింది. ఆపై లక్నో జట్టుతో కూడా ఆర్సీబీ ఓడిపోయింది. నాలుగు మ్యాచ్లు ఆడిన RCB ఒక్కటి మాత్రమే గెలిచింది. మూడింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం (ఏప్రిల్ 6) ఆర్సీబీ రెండు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. జట్టు ఇలాంటి స్థితికి చేరుకోవడానికి ప్రధాన కారణం అశ్విని అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్లో కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒక్కసారైనా ట్రోఫీ అందుకోవాలని ఆర్సీబీ జట్టు పోరాడుతుంది. ఆ కల ఇప్పటి వరకు నెరవేరలేదు. కనీసం ఈసారైనా ఆర్సీబీ బాగా ఆడి చాంపియన్గా నిలవాలని ఆ జట్టు అభిమానులంతా ఆశించారు. కానీ పేలవమైన ఆటతీరుతో జట్టు వైఫల్యం దిశగా వెళ్తుంది. దీంతో ఆర్సీబీ జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆర్సీబీ జట్టు వైఫల్యం వెనుక ఉన్న కారణాన్ని దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ సతీమణి అశ్వినిపై ఆ జట్టు అభిమానులు నెట్టారు.
ఐపీఎల్ ప్రారంభ సమయంలో ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ జరిగింది. అందుకు ముఖ్య అతిథిగా అశ్విని పాల్గొన్నారు. ఆ జట్టు సభ్యుల కొత్త జర్సీలను కూడా ఆమెనే రివీల్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు ఒక దురదృష్టవంతురాలిని అతిథిగా పిలవడం ఏంటి అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్లు చేశారు. భర్తలేని వ్యక్తితో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే ఇప్పుడు ఆ జట్టు వైఫల్యం చెందుతుందని వారు చెబుతున్నారు.
(ఆర్సీబీ జర్సీతో పునీత్ రాజ్కుమార్ పాత చిత్రం)
ఆర్సీబీ అన్బాక్స్ కార్యక్రమంలో అశ్విని పునీత్ రాజ్ పాల్గొనడాన్ని ఆ జట్టు ఫ్యాన్స్ కొందరు తప్పుబట్టారు. భర్తను కోల్పోయిన అశ్విని ఈ శుభకార్యక్రమంలో పాల్గొనడం దురదృష్టకరమని పోస్టులు పెట్టారు. అశ్వినిని తప్పు పడుతూ ఒక నెటిజన్ వీడియో కూడా విడుదల చేశాడు. ఇది చూసిన చాలామంది అభిమానులు సదరు వ్యక్తిని తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో అతను పోస్ట్ తొలగించాడు. అశ్వినిపై ఇలాంటి పోస్ట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పునీత్ రాజ్కుమార్ అభిమానులు ఫిర్యాదు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న పునీత్ రాజ్కుమార్ 2021లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మరణించారు.
ಅಶ್ವಿನಿ ಪುನೀತ್ ರಾಜಕುಮಾರ್ ಅವರು ಎನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅರ್ಥ ಆಯ್ತಾ?
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 14, 2024
Any idea what Ashwini Puneeth Rajkumar is doing here?
Find out more at the RCB Unbox event on 19th March. Last few tickets remaining!@Ashwini_PRK #ArthaAytha #RCBUnbox #PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/AmKTYC8mUJ