
దక్షిణాది నటీమణుల్లో నటి నిత్యామీనన్(Nithya Menen) రూటే వేరయ్యా..అని అనవచ్చు. పిట్ట కొంచెం కూత ఘనం లెక్క ఈ భామది. బాల నటిగానే సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళ అమ్మడు మాతృభాషలోనే కథానాయకిగానూ పరిచయం అయ్యారు. ఆ తరువాత తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఎంట్రీ ఇచ్చారు. అలా తమిళంలో 180 అనే చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత వరుసగా అక్కడ నటిస్తున్న నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో ఓ కాదల్ కణ్మణి చిత్రంలో నటించి బాగా పాపులర్ అయ్యారు.
ఇకపోతే ఇటీవల తిరుచ్చిట్రం ఫలం చిత్రంలో ధనుష్తో జత కట్టిన ఈమె ఆ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డును గెలుచుకున్నారు. తాజాగా మరోసారి ధనుష్ సరసన నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతికి జంట గా తలైవన్ తలైవి చి త్రంలో నటిస్తున్నా రు.
కాగా నటి నిత్యామీనన్కు కాస్త తల బిరుసు తనం ఎక్కువనే ముద్ర ఉంది. ఆమె ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. ఈ బ్యూటీ ఇటీవల ఒక భేటీలో చాలా మంది మగవారు సగటు మహిళల మాదిరిగా నటీమణులను భావించరన్నారు. నటీమణులను ఈజీగా టచ్ చేయవచ్చని భావిస్తారన్నారు. తాము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా.. కరచాలనం అంటూ తమను టచ్ చేయడానికి ఎగబడతారని, అదే సాధారణ మహిళలను కరచాలనం అడుగుతున్నారా ?. అలా ఈజీగా టచ్ చేయడానికి తామేమన్నా ఆట బొమ్మలమా? అని నటి నిత్యామీనన్ ప్రశ్నించారు. ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
కొద్ది రోజుల క్రితం నిత్యామీనన్ ఓ ఈవెంట్కి వెళ్లింది. అక్కడ ఓ అభిమాని ఆమెకు షేక్హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నిత్యామీనన్ అతనికి నమస్కారం చేసి తనకు జలుబు ఉందని చెప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేదికపై ఉన్న నటుడిని కౌగిలించుకుని చేయి ఇచ్చారు. ఈ వీడియోని షేర్ చేస్తూ నిత్యామీనన్ను నెటిజన్స్ ట్రోల్ చేశారు. దీనికి కౌంటర్గా తాజాగా నిత్యామీనన్ పై విధంగా వివరణ ఇచ్చింది.