టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బన్నీకి నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 19 మందికి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది.
కాగా.. ఈ కేసులో ఏ1 నుంచి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. నిందితుల వ్యక్తి గత హాజరు తరువాత ఈ కేసులో నాంపల్లి కోర్టు ట్రయల్ ప్రారంభించునుంది.

అసలేం జరిగిందంటే..
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 రిలీజ్ ముందు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తేజ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం రేవతి కుమారుడు తేజ కోలుకుంటున్నారు. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ అండగా నిలిచారు. తేజ వైద్య ఖర్చులకు సాయం అందిస్తున్నారు.


