
ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన మోహన్ బాబు మరో ఆడియో సందేశం రిలీజ్ చేశారు. ఈ ఘటన జరిగినందుకు తాను ఎంతో చింతిస్తున్నట్లు ఆడియో సందేశమిచ్చారు. మొదట తాను నమస్కారం పెట్టానని.. అయినప్పటికీ అతను మైక్ పెట్టాడని అన్నారు. జర్నలిస్టును కొట్టాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. మీడియాపై దాడి ఘటనపై మోహన్ బాబు వివరణ ఇచ్చారు.
నా కన్నుకు మైక్ తగలబోయిందని.. తృటిలో తప్పించుకున్నానని మోహన్ బాబు వెల్లడించారు. ఇలా మీడియా ప్రతినిధులపై దాడి చేయాల్సి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. నిజ జీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదన్నారు. నా ఇంటి గేట్లు బద్దలు కొట్టి లోపలికి రావడం న్యాయమేనా?అని ప్రశ్నించారు. నేను చేసింది న్యాయమా? అన్యాయమా? అనేది ప్రజలు, నాయకులు ఆలోచించాలని మోహన్ బాబు కోరారు.
(ఇది చదవండి: ఆస్పత్రి నుంచి టాలీవుడ్ నటుడు మోహన్ బాబు డిశ్చార్జ్)
నా ఇంట్లోకి వచ్చింది మీడియా వాళ్లు అవునో, కాదో తనకు తెలియదని మోహన్ బాబు చెప్పారు. నా ఇంటి లోపలికి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని అన్నారు. ఆవేశంలో తాను కొట్టిన దెబ్బ అతనికి తగిలిందని.. ఈ ఘటనకు బాధపడుతున్నానని వివరించారు. జర్నలిస్టును కొట్టాలని ఆ దేవుడి సాక్షిగా తాను అనుకోలేదని మోహన్ బాబు వెల్లడించారు. మా కుటుంబ సమస్యకు మధ్యవర్తులు అవసరం లేదని.. నా పిల్లలతో కలిసి తామే పరిష్కరించుకుంటామని తెలిపారు.
పోలీసులపై సంచలన వ్యాఖ్యలు..
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. పోలీసుల ప్రవర్తనను ప్రజలంతా గమనించాలని మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎవరి కుటుంబంలోనైనా ఇలాంటి గొడవలు సహజమేనని ఆడియో సందేశంలో మాట్లాడారు.
