5 పెళ్లిళ్లు.. 300 సినిమాలు.. చేతిలో చిల్లిగవ్వ లేక దిక్కులేని స్థితిలో.. | Mahesh Anand, Tollywood Villain did 300 Films, Married 5 Times | Sakshi
Sakshi News home page

5 పెళ్లిళ్లు.. నిండా మునిగిన టాలీవుడ్‌ నటుడు.. నీళ్లబాటిల్‌ కొనేందుకు డబ్బులేని స్థితిలో..

Jun 28 2025 2:28 PM | Updated on Jun 28 2025 2:56 PM

Mahesh Anand, Tollywood Villain did 300 Films, Married 5 Times

కరాటేలో బ్లాక్‌బెల్ట్‌.. డ్యాన్సర్‌, మోడల్‌. ఇవన్నీ కాదని నటనవైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండితెరపై తిరుగులేని నటుడిగా రాణించాడు. కానీ, నిజ జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. అతడే నటుడు మహేశ్‌ ఆనంద్‌ (Mahesh Anand).

కెరీర్‌
1982లో సనమ్‌ తేరీ కసం మూవీలో బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్‌గా పనిచేశాడు. రెండేళ్ల గ్యాప్‌ తర్వాత కమల్‌ హాసన్‌ 'కరిష్మా' చిత్రంతో నటుడిగా మారాడు. సస్తి దుల్హన్‌ మహేంగ దుల్హ చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కవుట్‌ కాకపోవడంతో విలన్‌గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్‌లో కరడుగట్టిన విలన్‌గా పేరు గడించిన మహేశ్‌ ఆనంద్‌.. తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పీ పరశురామ్‌, బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, అల్లుడా మజాకా, నెంబర్‌ వన్‌, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్‌ చేసి ఇక్కడి జనానికి దగ్గరయ్యాడు.

ఐదు పెళ్లిళ్లు
వెండితెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట బర్క రాయ్‌ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 

అవకాశాలు దూరం
అనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. రెండేళ్లకే (2000-2002) వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేశ్‌ కెరీర్‌ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అని ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో నాలుగుసార్లు విఫలమైన మహేశ్‌.. 2015లో రష్యన్‌ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్లు తెలుస్తోంది. 

పేదరికంలో మగ్గిన నటుడు
వందల సినిమాలు చేసిన మహేశ్‌.. దాదాపు 18 ఏళ్లపాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతడే ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెప్‌ బ్రదర్‌ రూ.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కి పైగా సినిమాలు చేశా.. కానీ, ఇప్పుడు నీళ్ల బాటిల్‌ కొనుక్కునేందుకు కూడా డబ్బుల్లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరం అని రాసుకొచ్చాడు.

మూడురోజులుగా కుళ్లిపోయిన మృతదేహం
2019 ఫిబ్రవరి 9న మహేశ్‌ తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. మూడు రోజులుగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమేనని వైద్యులు ధ్రువీకరించారు. కానీ, అప్పటికే మరణించి మూడు రోజులైనట్లు వెల్లడించారు.

చదవండి: ఆ డైరెక్టర్‌ తిట్టాడు.. నావల్ల కాక ఏడ్చేశా: కీర్తి సురేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement