
విమర్శలు అందుకోని సెలబ్రిటీలు ఉండరు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సినిమా రూపంలో వారు విమర్శలపాలవుతూనే ఉంటారు. హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) కూడా అలా తిట్లు తినే ఇక్కడివరకు వచ్చిందట! ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఉప్పు కప్పురంబు. సుహాస్ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో జూలై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేశ్ తనను బాధపెట్టిన ఓ సంఘటనను చెప్పుకొచ్చింది.
ఇప్పటికీ బాగా గుర్తు
కీర్తి మాట్లాడుతూ.. ప్రియదర్శన్ సర్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం(గీతాంజలి)తో కథానాయికగా నా జర్నీ మొదలైంది. అప్పుడు జరిగిన ఓ సంఘటన నాకు చాలా బాగా గుర్తుంది. ఓ సన్నివేశం షూటింగ్ అయ్యాక.. ఎంత చెత్తగా చేశావో తెలుసా? వెళ్లి మానిటర్ చూసుకోపో అని తిట్టాడు. నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు అది మొదటి సినిమా కావడంతో ఏడ్చేశాను. ఆయన అందరినీ అలానే అనేస్తాడు. ఆయన కూతురు, నటి కళ్యాణి ప్రిదయర్శన్ను కూడా అలాగే తిట్టేవాడు.
అంతదాకా తెచ్చుకోను
కానీ ఉప్పుకప్పురంబు డైరెక్టర్ అని శశి మాత్రం నటీనటులకు చాలా స్వేచ్ఛ ఇస్తాడు. ఈయన ఆవేశంతో తిట్టేవరకు పరిస్థితులు చేయిదాటిపోనివ్వను. అప్పటికే ఆయన చెప్పిన సీన్లో బాగా నటిస్తాను. ఇంకో విషయమేంటంటే.. ఈ డైరెక్టర్ మంచి నటుడు కూడా! చాలామంది డైరెక్టర్లు చెప్తారంతే.. కానీ ఈయన ఎలా యాక్ట్ చేయాలని చేసి చూపిస్తాడు అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. గీతాంజలి చిత్రంతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన కీర్తి సురేశ్.. తెలుగులో నేను శైలజ, నేను లోకల్, మహానటి, రంగ్దే, దసరా, సర్కారువారిపాట వంటి పలు చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్ వాడే కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చింది.
చదవండి: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్