
దివంగత ప్రముఖ నటి మీనాకుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా తెరకెక్కనుంది. ‘హిచ్ కీ, మహారాజ్’ వంటి చిత్రాల ఫేమ్ సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. కాగా ఈ సినిమాలోని మీనాకుమారి పాత్ర కోసం కృతీసనన్, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఇటీవల ఈ సినిమా కథని కియారా అద్వానీకి వినిపించగా, ఆమె గ్రీన్సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో వివాహ బంధంలో అడుగుపెట్టిన కియారా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు.
ఆమె ప్రసవం, కొంత విశ్రాంతి తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలన్నది మేకర్స్ ప్లాన్. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మీనాకుమారిలా కనిపించాలనుకోవడం కియారాకు పెద్ద సవాల్ అని, అయినప్పటికీ కథ నచ్చి ఒప్పుకున్నారని బాలీవుడ్ టాక్. ట్రాజెడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే మీనా కుమారిగా కియారా నటిస్తే, ఈ సినిమాలోని దర్శకుడు కమల్ అమ్రోహి పాత్రను ఎవరు పోషించనున్నారనే చర్చకూడా జరుగుతోంది. సిద్ధార్థ్ పి. మల్హోతా, అమ్రోహి ఫ్యామిలీ, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.