
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ప్రారంభమైనప్పుడు పెద్దగా అంచనాల్లేవు గానీ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించడంతో కాస్త బజ్ ఏర్పడింది. తొలుత టీజర్ రిలీజైనప్పుడు విమర్శలు కాస్త గట్టిగానే వచ్చాయి కానీ తర్వాత తర్వాత పాటలు, ట్రైలర్ విడుదల చేసినప్పుడు నెగిటివిటీ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో టీమ్ ఓ నోట్ రిలీజ్ చేసింది.
'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది గానీ సింపుల్గా చెప్పుకొంటే క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్లో అల్లు అర్జున్?)
చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు విజువల్స్, మంచు విష్ణు యాక్టింగ్పై ట్రోల్స్ గట్టిగానే వచ్చాయి. అప్పుడు పలువురు యూట్యూబర్స్ టీజర్పై తమ అభిప్రాయాలు చెబుతూ వీడియోస్ చేశారు. కానీ నిర్మాణ సంస్థ.. సదరు యూట్యూబ్ ఛానెల్స్పై స్ట్రైక్స్ వేయడం లాంటివి చేసిందని పలువురు బయటకొచ్చి మరీ చెప్పారు. తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. మరి ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు. విష్ణు ఈ చిత్రంపై చాలా నమ్మకం, పెట్టుబడి పెట్టాడు. మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?
(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)
