
'పుష్ప'తో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో ఆచితూచి సినిమాలు ప్లాన్ చేసే పనిలో ఉన్నాడు. అప్పటికే ఓకే చేసిన త్రివిక్రమ్ ప్రాజెక్ట్ని పక్కనబెట్టేశాడు. తమిళ దర్శకుడు అట్లీకి అవకాశమిచ్చాడు. త్వరలో షూటింగ్ మొదలయ్యే ఈ మూవీ ఓ రేంజులో ఉండబోతుందని ప్రమోషనల్ వీడియోల బట్టి అర్థమవుతోంది. దీని తర్వాత ఎవరితో చేస్తాడా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు దానికి ఓ సమాధానం దొరికినట్లు అనిపిస్తోంది.
మొన్నీమధ్యే 'తమ్ముడు' మూవీ ప్రమోషన్లో భాగంగా దిల్ రాజు పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఒకదానిలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అల్లు అర్జున్తో ఓ సినిమా మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. దర్శకుడు ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్తోనే అని సోషల్ మీడియాలో గట్టిగా టాక్ వినిపిస్తోంది. అది కూడా నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'రావణం' అని అంటున్నారు.
(ఇదీ చదవండి: అఖిల్కి హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?)
లెక్క ప్రకారం 'రావణం' సినిమాని ప్రభాస్తో తీయాలని నీల్ అనుకున్నాడట. కానీ ప్రస్తుతం ప్రభాస్కి ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా అది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్తో 'డ్రాగన్' చేస్తున్న నీల్.. ఇది పూర్తయిన తర్వాత బన్నీతో కలిసి పనిచేస్తాడనిపిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ.
ఎందుకంటే కేజీఎఫ్, సలార్ సినిమాలతో తన స్టాండర్డ్ పెంచేసుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పుడు తారక్తో మూవీ చేస్తున్నాడు. కేజీఎఫ్ 3, సలార్ 2 కూడా తీయాల్సి ఉంది కానీ అవి ఇప్పట్లో సాధ్యమవుతాయా? లేదంటే 'రావణం' తీసిన తర్వాత ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయా అనిపిస్తుంది. ఏదేమైనా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రేజీ కాంబినేషన్ల గురించి ఎప్పటికప్పుడు ఏదో ఓ రూమర్ వినిపిస్తూనే ఉంది. మరి వాటిలో ఎన్ని నిజమవుతాయో చూడాలి?
(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)