‘‘ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి. చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తెలంగాణలో చిన్న సినిమాల అభివృద్ధికి మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అని ‘తెలంగాణ రక్షణ సేన పార్టీ’ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు.
దినేష్ కుమార్, దివిజ జంటగా నటించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. సతీష్ ఆవాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా, దర్శకుడు దశరథ్ అతిథిగా హాజరయ్యారు. ‘‘ఒక ఆడబిడ్డ కన్నీటి కథే ఈ చిత్రం. సినిమా చూస్తున్నప్పుడు కంటతడి పెట్టకుండా ఉండలేరు’’ అన్నారు కోమలి మహేందర్. ‘‘కుటుంబాల్లో తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మా చిత్రం చూపిస్తుంది’’ అని చెప్పారు సతీష్ ఆవాల. ‘‘వెంకట్రామయ్య పాత్ర చేస్తున్నప్పుడు గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు వచ్చాయి’’ అని మురళీధర్ గౌడ్ తెలిపారు. సుధ, సత్యశ్రీ, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు.


