
‘‘ఒక స్టార్ (తార) పుట్టింది.... కుమారి’’ అంటూ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్ని విడుదల చేసింది. 1950 మద్రాస్ నేపథ్యంలో రూపొందిన ‘కాంత’ చిత్రంలో భాగ్యశ్రీ పోషించినపాత్ర పేరు కుమారి. మంగళవారం (మే 6) ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని కొత్త ఫొటోను విడుదల చేసింది యూనిట్. ప్రశాంత్ పోట్లూరి, జోమ్ వర్గీస్తో కలిసి రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా – దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా రూపొందిన చిత్రం ‘కాంత’.
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఈ బహు భాషా చిత్రం రూపొందింది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘‘అద్భుతమైన కథ, గొప్ప నటీనటులు, ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతినిచ్చేలా ఉంటుంది. త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.