ఓటీటీలో 'కె.విశ్వనాథ్‌' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్‌ | K Viswanath Last Directed Movie Subhapradam Released In Ott After 15 Years, Check Out More Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'కె.విశ్వనాథ్‌' చివరి సినిమా.. 15 ఏళ్ల తర్వాత స్ట్రీమింగ్‌

Jun 30 2025 9:36 AM | Updated on Jun 30 2025 10:56 AM

k viswanath Last Directed Movie subhapradam Now OTT Streaming

కళాతపస్వి 'కె.విశ్వనాథ్‌' దర్శకత్వం వహించిన చివరి సినిమా 'శుభప్రదం'.. 15 ఏళ్ల తర్వాత ఓటీటీలో విడుదలైంది. 2010లో విడుదలైన ఈ చిత్రంలో అల్లరి నరేష్, మంజరి ఫడ్నిస్ జంటగా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. పాటలు పరంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు. సాగర సంగమం, శ్రుతిలయలు, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం... ఇలా ఒకదాన్ని మించి మరొకటి? సినిమాలను తెరకెక్కించిన దర్శకులు కె. విశ్వనాథ్‌.. అయితే, చాలా కాలం గ్యాప్‌ తర్వాత ఆయన 'శుభప్రదం' సినిమా కోసం మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. 

కానీ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బలహీనంగా ఉన్నాయని ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. హీరోయిన్‌ పాత్ర చాలా బలంగా ఉందని , హీరో పాత్ర అంతగా మెప్పించలేదని రివ్యూలు ఇచ్చారు. ప్రేక్షకుల హృదయాలను శుభప్రదం అస్సలు ఆకర్షించలేదని చాలామంది చెప్పారు. సుమారు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి  విశ్వనాథ్‌ చివరి సినిమా రావడంతో ఆయన అభిమానులు మాత్రం చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

'శుభప్రదం' సినిమా 'జియోహాట్‌స్టార్‌' (jiohotstar)లో సడెన్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో ఒక పోస్టర్‌ను కూడా పంచుకున్నారు. కె.విశ్వనాథ్‌ సుమారు 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో 5 సినిమాలు  జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డ్స్‌ అందుకోవడం విశేషం. అంతటి గొప్ప దర్శకుడి చివరి సినిమా అందరికీ అందుబాటులో ఉండాలని ఓటీటీలో విడుదల చేశారు. 92 ఏళ్ల వయసులో కె. విశ్వనాథ్‌ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement