
మనకేం అవుతుందిలే? అనుకునే రోజులు కావివి. మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ. ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ ఏఐ 171 విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదం (Ahmedabad Plane Crash)లో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు.
నా విషయంలోనూ ఇదే మిరాకిల్
ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 11A సీటులో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ (38) అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే 27 ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌంగ్సక్ లోయ్చుసక్ (47). సింగర్ మాట్లాడుతూ.. 'ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో 11A సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను. నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను.

రెండో జన్మ..
ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది. కానీ ఆ తర్వాత విమానప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది. ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు కిటికీవైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని. నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు, పిడుగు శబ్ధం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని. నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది. ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు, ఆ మట్టి వాసన, నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి' అని చెప్పుకొచ్చాడు.
1998లో విషాదం
1998లో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ TG261 విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది. ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 101 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది చనిపోయారు. 45 మంది గాయపడ్డారు.
మాటలకందని విషాదం
జూన్ 12.. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఎయిరిండియా విమానం.. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది. 625 అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది. క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు.
చదవండి: అఖిల్తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?