‘బాహుబలి, పుష్పాలకే ప్లాప్‌ అన్నారు.. తెలుగోళ్లకే ఎందుకిలా ?’ | Sandeep Kishan Defends His Casting In Sigma, Says Telugu Talent Deserves More Recognition | Sakshi
Sakshi News home page

Sigma Sundeep : తెలుగోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తున్నాం?: సందీప్‌

Sep 17 2026 8:34 AM | Updated on Sep 17 2026 9:03 AM

Hero Sundeep Kishan Speech At The Sigma Movie Event

తమిళనాడు సీఎం విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్‌ నిర్మించారు. తమిళ, తెలుగు భాషల్లో అక్టోబరు 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ లిమిటెడ్‌, ఎన్‌వీఆర్‌ సినిమా సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సందీప్‌ కిషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో ఎగిరిపడ్డ కంటెస్టెట్లు.. ఆడపిల్ల అని కూడా చూడలేదు)

‘సంజయ్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఎంతో ప్రేమ, గుర్తింపు ఇచ్చారు. సంజయ్‌ అనుకుంటే ఎవరితోనైనా సినిమా చేయగలరని, కానీ నాతోనే తొలి చిత్రంలో హీరోగా తనను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘సిగ్మా’ కోసం నన్ను ఎంపిక చేసినప్పుడు తమిళనాడులో ఎలాంటి సందేహాలు వ్యక్తం కాలేదు. కానీ తెలుగులో మాత్రం సందీప్‌ను ఎందుకు హీరోగా తీసుకున్నారనే ప్రశ్నలు వచ్చాయని సందీప్‌ తెలిపారు.

మనోళ్లను మనమే ఎందుకు తక్కువ చేస్తాం?
తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటని సందీప్‌ అన్నారు. అయితే ఆ సినిమా విడుదలైన తొలినాళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనే ప్లాప్‌ టాక్‌ వచ్చిందని గుర్తుచేశారు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురైందన్నారు. ‘మనోళ్లను మనం పెంచుకోవడానికి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? మన వాళ్లు వేరే ప్రాంతాలకు వెళ్లి గొప్పగా చేస్తుంటే.. ‘తెలుగోళ్లు ఏదో చేయగలరు’ అంటూ ఇతర రాష్ట్రాల వారు మన టాలెంట్‌ను గుర్తిస్తున్నారు. ఇదే మన తెలుగు గొప్పతనం’ అని సందీప్‌ కిషన్‌ పేర్కొన్నారు.

కాగా సినిమా విషయానికి వస్తే ‘సిగ్మా’లో రాజు సుందరం, సంపత్‌ రాజ్‌, శివ్‌ పండిట్‌, అంబు దాసన్‌, యోగ్‌ జాపీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ‘సిగ్మా’పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement