మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన థ్రిల్లర్ మూవీ దృశ్యం-3. ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మే 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. గతంలో రిలీజైన దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను తెలుగులో రీమేక్ చేశారు. వెంకటేశ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి.
అయితే దృశ్యం-3 మాత్రం తెలుగులో డబ్బింగ్ చేసి మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ రీమేక్ చేయకపోవడంపై సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు రీమేక్ చేయకపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు రీమేక్ చేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు.
దృశ్యం-3 మూవీని తెలుగులో రీమేక్ చేయడం లేదని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. ఇతర భాషల్లోని హీరోల ఇమేజ్ దృష్ట్యా ప్రేక్షకులకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం రీమేక్ జరుగుతోందని తెలిపారు. ఎందుకంటే బాలీవుడ్ మేకర్స్ ఇప్పటికే రైట్స్ తీసుకున్నారని.. అంతేకాకుండా ఈ మూవీ క్లైమాక్స్ మార్చుకుంటామని మర్యాదపూర్వకంగా అడిగారని వెల్లడించారు. అందుకే తాను రీమేక్ చేసేందుకు అంగీకరించినట్లు జీతూ వెల్లడించారు. దీంతో తెలుగు రీమేక్పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.


